భావసారము
చరణం 1
శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా
శ్రీ రాముడు శరణాగతుల రక్షకుడు, కారుణ్యాలయం అని ప్రకటిస్తూ “నిన్ను నమ్ముకున్నవారిని వదలని స్వామివి నీవు” అని నమ్మకంతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ మొదటి చరణంలో శ్రీ భద్రాచల రామదాసు గారు.
చరణం 2
మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా మరవక యిక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా
ఇక్కడ భక్తుని అభిమానము కనిపిస్తుంది. “నీవే నా స్వామివని లోకముందు చెప్పాను. ఇప్పుడు నన్ను మరవకూడదు.” ఇది భయంతో కూడిన భక్తి కాదు హక్కుతో కూడిన శరణాగతి.
చరణం 3
క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా దారిద్ర్యము
పరిహారము చేయవె దైవశిఖామణి రామా
ఈ చరణం అత్యంత మానవీయమైనది. “నేను తప్పులు చేసాను. కానీ వాటిని లెక్కించవద్దు.” పాపస్మరణ, పశ్చాత్తాపం, ఆశ మూడు ఒకేసారి దర్శనమిస్తాయి.
చరణం 4
గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా భావముతో నినుగొంటిని కదా భావజారి రామా
గురు, శాస్త్రం, దైవం ఈ మూడు ఒకటేనని చెప్పే తాత్త్విక భావన ఇక్కడ కనిపిస్తుంది. భక్తి అంధం కాదు; అది జ్ఞానంతో కూడిన విశ్వాసం.
వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా
రామదాసు తనను తాను పూర్తిగా రాముని సేవకుడిగా సమర్పించుకుంటాడు. భద్రాచల రాముడు కేవలం దేవుడు కాదు, తన జీవితాధారమని స్పష్టం చేస్తాడు.
ఈ కీర్తనలోని సాహిత్య విలువలు, సరళమైన పదప్రయోగం తో లోతైన అర్థం తో హూడినది, భాష చాలా సులభం. కానీ భావం చాలా గంభీరం. సాధారణ భక్తుడి హృదయస్పందనే ఈ కీర్తన. ఇనవంశోత్తమ, శ్రీరఘునందన, దైవశిఖామణి, భద్రాద్రీశ్వర అను సంబోధనల వైవిధ్యం ప్రతి సంబోధన రాముని ఒక గుణాన్ని తెలియజేస్తుంది. “నీవు తప్ప నాకు దారి లేదు.” అను శరణాగతి తత్త్వం మొత్తం ఒకే సందేశం చెబుతున్నది ఇది వైష్ణవ భక్తి సంప్రదాయానికి మణిహారం. ఆత్మకథాత్మక స్పర్శ
రామదాసు జీవిత కష్టాలు, నిర్బంధాలు, ఆర్తి అన్నీ పరోక్షంగా ఈ కీర్తనలో ప్రతిఫలిస్తాయి. అందుకే ఇది యుగాలు దాటినా హృదయాలను తాకుతుంది.